NTV Telugu Site icon

అమల్లోకి ప్రధాని ఫ్రీ వ్యాక్సిన్‌ పాలసీ.. ఇంకా క్లారిటీ లేదు..!

Covid Vaccine

Covid Vaccine

జూన్ 21 నుంచి ఫ్రీ వాక్సిన్ అని ప్రధాని ప్రకటించగానే 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ వాక్సిన్ వేసుకునేందుకు సిద్దం అయ్యారు. తీరా వాక్సిన్ సెంటర్లకు వెళ్తే ఇప్పుడే కాదు.. ఇంకా మరిన్ని రోజులు ఆగాల్సిందేనని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మోడీ చెప్పినా.. పట్టించుకోరా అని ఎదురు ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ పీఎమ్‌ ప్రకటించినా రాష్ట్రాలకు ఇంకా వాక్సిన్ కోటా పెరగలేదని వైద్యసిబ్బంది చెబుతున్నారు. వ్యాక్సిన్‌ పాలసీలో భాగంగా.. మొదట 45 ఏళ్ల పైబడిన వాళ్లకు వాక్సిన్ వేశారు. తర్వాత 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికి వాక్సిన్ ఇస్తామని చెప్పారు. 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళకు వేయాల్సిన వాక్సిన్ డోసులు రాష్ట్రాలే కొనుక్కోవాల్సి ఉంటుందని కేంద్ర గతంలో చెప్పింది.. దాంతో రాష్ట్రాలు వాక్సిన్‌లను కొనేందుకు ఏకంగా గ్లోబల్ టెండర్లను పిలిచాయి. అయినా వ్యాక్సిన్‌ దొరకలేదు. దాంతో కేంద్రమే అందరికి వాక్సిన్ వెయ్యాలని రాష్ట్రాలన్నీ కోరాయి. చివరకు అందరికి కేంద్రమే ఉచితంగా వాక్సిన్ ఇస్తుందని ప్రధాని స్వయంగా ప్రకటించారు..

ఇప్పటి వరకు తెలంగాణాలో 18 ఏళ్లు పైబడిన వాళ్ళకు వాక్సిన్ ప్రారంభం కాలేదు. అయితే హైరిస్క్ కేటగిరిల్లో ఉన్న వాళ్లకు మాత్రం ప్రత్యేకంగా క్యాంపులు పెట్టి వాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి దాదాపు కోటి డోసుల వాక్సిన్ తెలంగాణాకు వచ్చింది.. అందులో దాదాపు 92 లక్షల డోసులు వేశారు, అందులో తొలి డోసు దాదాపు 76 లక్షల వరకు వేస్తే .. 15 లక్షల మంది మాత్రమే రెండో డోస్ పూర్తి చేసుకున్నారు.. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి వాక్సిన్ కోటా పెరిగితే వాక్సిన్ ప్రోగ్రాం త్వరగా పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్యశాఖ చెప్తోంది.