Site icon NTV Telugu

Uttar Pradesh: యూపీలో విషాదం.. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు స్పృహ కోల్పోయారు.

దీంతో తల్లిదండ్రులు చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే వాళ్లు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను మంజన (3), స్వీటీ (3), సమర్ (2), అరుణ్ (5)గా గుర్తించారు. వీరిలో మంజన, స్వీటీ, సమర్ తోబుట్టువులుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లలు తిన్న చాక్లెట్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ఖుషీనగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. కాగా చాక్లెట్ తిని నలుగురు చిన్నారులు మృతి చెందడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు.

https://ntvtelugu.com/lalu-prasad-yadav-health-is-critical-again-on-wednesday/
Exit mobile version