Shaktikanta Das: ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ని ప్రభుత్వం శనివారం నియమించింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుందని క్యాబినెట్ నియామకాల కమిటీ ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఆయన పదవీ కాలం ప్రధాని పదవీ కాలంతో సమానంగా ఉంటుంది లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం ప్రధానికి మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2019, సెప్టెంబర్ 11 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. ఇప్పుడు శక్తికాంత దాస్ రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు.
శక్తికాంత దాస్ గురించి..
ఫిబ్రవరి 26, 1957న భువనేశ్వర్లో జన్మించిన దాస్, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్కి చెందిన ఐఎఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఆర్థిక రంగ ఒత్తిళ్లతో కూడిన సమయంలో 2018లో ఆర్బీఐకి 25వ గవర్నర్గా బాధ్యతలు తీసుకున్నారు. కోవిడ్-19, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం వంటి కఠిన పరిస్థితుల్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి, దేశ ఆర్థిక వ్యవస్థని నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు. గత ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. 2021లో, ప్రజా పరిపాలనకు ఆయన చేసిన కృషికి గాను ఉత్కళ్ విశ్వవిద్యాలయం దాస్కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్.) బిరుదును ప్రదానం చేసింది.