Site icon NTV Telugu

Assembly Elections : ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎలక్షన్ హీట్

Election

Election

భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం , పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరుకుంది. ఈ ఎన్నికలు కేవలం స్థానిక ప్రభుత్వాల మార్పుకే పరిమితం కాకుండా, కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలైన బీజేపీ , కాంగ్రెస్ ఏ మేరకు పాగా వేస్తాయన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో పోరు మళ్ళీ మమతా బెనర్జీ (దీదీ) వర్సెస్ ప్రధాని మోడీగా మారింది. వరుసగా నాలుగోసారి విజయం సాధించాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ పట్టుదలతో ఉంది. మమతా బెనర్జీ తన 15 ఏళ్ల సంక్షేమ పథకాలు , బెంగాలీ అస్తిత్వాన్ని నమ్ముకోగా, బీజేపీ అవినీతి , శాంతిభద్రతల సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుంది. అయితే, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ ప్రభావం వల్ల ఏర్పడిన ఎల్పీజీ (LPG) కొరత బీజేపీకి ప్రతికూలాంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్‌లో ఏప్రిల్ 23 , 29 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Man Kills Wife: లవ్ మ్యారేజ్, నాలుగు నెలలకే భార్య దారుణహత్య..

తమిళనాడులో ఈసారి పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటములకు తోడు, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ రంగ ప్రవేశం చేసింది. సీఎం స్టాలిన్ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించాలని చూస్తుండగా, అన్నా డీఎంకే నేత పళనిస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న విజయ్ ఒంటరి పోరుకు సిద్ధమవ్వడం ఎవరి ఓట్లను చీలుస్తుందోనన్న భయం ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. ఇక్కడ ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేరళలో పినరై విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి (LDF) హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉంది. బీజేపీ ఇక్కడ బలమైన మూడో శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.

War Efeect : మిడిల్ ఈస్ట్ వార్.. మరొక స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా

అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో బీజేపీ ‘డబుల్ ఇంజన్ సర్కార్’ నినాదంతో ముందుకు వెళ్తుండగా, కాంగ్రెస్ యువనేత గౌరవ్ గొగోయ్ ఆధ్వర్యంలో గట్టి పోటీ ఇస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇక్కడ కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆశలు పెట్టుకుంది. మొత్తం ఐదు రాష్ట్రాల ఓటర్ల తీర్పు ఏంటో మే 4న వెలువడనున్న ఫలితాలతో తేలిపోనుంది. ప్రాంతీయ పార్టీల పట్టు నిలుస్తుందా లేదా జాతీయ పార్టీలు తమ ప్రభావాన్ని చాటుతాయా అనేది అప్పటి వరకు వేచి చూడాలి.

Exit mobile version