Site icon NTV Telugu

Sonam Wangchuk: లడఖ్ రాష్ట్రహోదా.. 21 రోజుల నిరాహారదీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..

Sonam Wangchuk

Sonam Wangchuk

Sonam Wangchuk: లడఖ్ రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మంగళవారం లేహ్‌లో తన నిరాహార దీక్షను విమరించారు. మైనర్ బాలిక ఇచ్చిన నిమ్మరసాన్ని తాగి నిరాహార దీక్షను విరమించారు. ఈ కార్యక్రమానికి జనం భారీ సంఖ్యలో నిరసన వేదిక వద్ద హాజరయ్యారు. ‘‘నిరాహార దీక్ష మొదటి దశ ఈ రోజుతో ముగిసింది. అయితే ఇది ఆందోళన ముగింపు కాదు’’ అని ఆయన పేర్కొన్నారు. “లడఖ్ కోసం రాజ్యాంగపరమైన రక్షణలు మరియు ప్రజల రాజకీయ హక్కుల కోసం నేను పోరాడుతూనే ఉంటానని అన్నారు.

Read Also: Jaishankar: చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో.. ఫిలిప్పీన్స్‌కి భారత్ మద్దతు..

విద్యా సంస్కరణవాది, పర్యావరణ కార్యకర్త అయిన వాంగ్ చుక్ మాట్లాడుతూ.. నిరాహార దీక్ష ముగింపు కొనసాగుతున్న ఆందోళన కొత్త దశకు నాంది అని అన్నారు. మా పోరాటాన్ని కొనసాగిస్తామని, 20 రోజులుగా వేదిక వద్ద 10,000 మంది ప్రజలు గుమిగూడటం, 60,000 మందికి పైగా పాల్గొనడం ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన అన్నారు. లేహ్ మరియు కార్గిల్ జిల్లాలతో కూడిన లడఖ్, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేసిన తర్వాత ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది.

అంతకుముందు మంగళవారం రోజు ఎక్స్ వేదికగా వాంగ్‌చుక్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. హిమాలయాలను రక్షించాలని, స్థానిక తెగలను రక్షించడానికి లడఖ్‌లో ఆరో షెడ్యూల్ అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 350 మంది ఈ రోజు -10 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిద్రపోయారని, కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం నుంచి ఒక్క మాట రాలేదని, దేశంలో మనకు చిత్తశుద్ధి, దూరదృ‌ష్టి, జ్ఞానం ఉన్న రాజనీతిజ్ఞులు కావాలని, చిన్న చూపు-క్యారెక్టర్ లేని రాజకీయ నాయకుడు వద్దని, త్వరలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తాము రాజనీతిజ్ఞులని నిరూపిస్తారని నేను చాలా ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశప్రయోజనాలను దృష్ట్యా చాలా జాగ్రత్తగా అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Exit mobile version