Farmer Debt Data: దేశంలో రైతులపై పెరుగుతున్న అప్పుల భారం గురించి కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక వివరాలు వెల్లడించింది. లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, రైతులపై ఉన్న అప్పుల వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రైతుల అప్పుల విషయంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
Read Also: Gas Cylinder : వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కొరతపై ప్రభుత్వం స్పష్టత
2025 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో రైతులపై మొత్తం రూ.3,75,254 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో రూ.2,01,744 కోట్ల రూపాయలు పంట రుణాలు (క్రాప్ లోన్స్) కాగా, రూ.1,73,510 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్ రూపంలో ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి రైతులపై భారీ రుణ భారం ఏర్పడింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులపై మొత్తం రూ.1,75,960 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో రూ.95,167 కోట్ల రూపాయలు పంట రుణాలు కాగా, రూ.80,792 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్గా ఉన్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా రైతులపై పెరుగుతున్న రుణ భారం వ్యవసాయ రంగంలో ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. రైతులకు ఆర్థిక సహాయం, స్థిరమైన ఆదాయం కల్పించే విధానాలు అవసరమని వారు సూచిస్తున్నారు.
