El Nino: రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026-27 ఎల్నినో సాధారణం కన్నా శక్తివంతంగా ఉండొచ్చని 180 మందికి పైగా పర్యావరణ, వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది దేశంలోని అడవులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, వన్యప్రాణులపై తీవ్రమైన ప్రభావం చూపొచ్చని అంటున్నారు. నష్టం జరిగిన తర్వాత దానిని అధ్యయనం చేయడానికి బదులు, ముందుగానే పర్యవేక్షించేందుకు వీలుగా, ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు వెంటనే సిద్ధం కావాలని సూచించారు.
‘‘సూపర్ ఎల్ నినో: 2026/2’’పై ఒక పరిశోధన జెనోడోలో ప్రచురితమైంది. ఎల్నినో అనేది సహజ వాతావరణ దృగ్విషయం. పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖకు సమీపంలోని ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరుగుతాయి. దీని వల్ల రుతుపవన వ్యవస్థ దెబ్బతింటుది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రపంచవాతావరణ సంస్థ నివేదిక ప్రకారం.. ఎల్ నినో ఇప్పటికే బలపడుతున్నట్లు చెప్పింది. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం దాదాపుగా 100 శాతం ఉంటుందని పేర్కొంది.
2026 నవంబర్ నుంచి వచ్చే ఏడాది వరకు భారత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా వేడి, పొడి వాతావరణం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తగ్గిన వర్షపాత నీటి కొరతను పెంచి వ్యవసాయం, అడవులు, పశుపోషణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలపై వేడి, కరువు ప్రభావం ఉంటుందని అంచనా. ఎడారి ప్రాంతాలు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించే మొక్కలు, జంతువుల మనుగడ కష్టంగా మారొచ్చు. నీటి వనరులపై ఒత్తిడి పడితే అది వ్యవసాయంపై, గ్రామీణ వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. నగరాల్లో వేడి తీవ్రం కావచ్చు. కాంక్రీట్, రోడ్ల కారణంగా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల కన్నా అధిక వేడి ఉండే అవకాశం ఉంది. అడవుల్లో కార్చిచ్చు వృక్ష, వన్యప్రాణాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించొచ్చని అంచనా. వాతావరణ మార్పులు జంతువుల ఆహారం, సంతానోత్పత్తిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.

