DMK: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. డీఎంకే కూటమిలో భాగంగా ఉన్న హస్తం పార్టీ ప్లేటు ఫిరాయించింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కాంగ్రెస్ తీరును ‘‘ద్రోహపూరితగ చర్య’’గా అభివర్ణించింది. ఓటమి, ద్రోహం తమకు కొత్త కాదని, ఇవి రెండూ శాశ్వతం కాదని, దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని డీఎంకే చెబుతోంది.
కష్టసుఖాల్లో కాంగ్రెస్కు తాము అండగా నిలిచామని డీఎంకే పార్టీ గుర్తు చేసింది, ఇప్పుడు ఆ పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వడంపై ‘‘అవకాశవాదులు’’ అని ఆరోపించింది. “కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులను లేదా సంక్షోభాలను ఎదుర్కొందో, అప్పుడు డీఎంకే ఒక దృఢమైన మిత్రపక్షంగా వారికి అండగా నిలిచింది. ఈ విధేయత కోసం మేము చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ, అయినా సరే, మేము దానిని చిరునవ్వుతో భరించాము,” అని డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు అన్నారు. కూటమిలో ఉంటేనే కాంగ్రెస్ 5 స్థానాలు గెలిచిందని ఆయన గుర్తు చేశారు.
Read Also: Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
కాంగ్రెస్ చర్యను గొప్ప రాజకీయ వ్యూహంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని, అవకాశవాదాన్ని సిద్ధాంతం అనే ముసుగులో కప్పిపుచ్చాలని చూస్తోందని, ఇది అవకాశవాద సిద్ధాంతం అని, డీఎంకే కూటమికి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇది బహిరంగ ద్రోహచర్యగా పరిగణించబడుతుందని బాలు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో కోసం బీజేపీ ఏం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే చేస్తోందని అన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళనాడులోని 234 స్థానాలకు గానూ టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి మరో 10 స్థానాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాంగ్రెస్ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ, విజయ్ మెజారిటీకి దూరంగానే ఉన్నారు. వీసీకే, వామపక్షాలు కానీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, తమిళనాడులో నెంబర్ గేమ్ కొనసాగుతోంది.
