Disha Salian Case: దిశా సాలియన్ మృతిపై సీబీఐ విచారణ మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. దివంతగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ముంబై మలాడ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురు పోలీసులు, అధికారుల పేర్లను కూడా ప్రస్తావించింది.
ఈ కేసుపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ఈ కేసు వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. తనకు, తన కుమారుడికి దిశా సాలియన్ మరణంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు పేరుతో వ్యక్తుల ప్రతిష్ట దెబ్బతీయొద్దని సీబీఐని కోరారు. అలా జరిగితే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దిశా సాలియన్ మరణం బాధాకరమని, ఈ ఘటనలోకి మమ్నల్ని ఎందుకు లాగుతున్నారు.? అని ప్రశ్నించారు. మాకు దీనితో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని ఉద్ధవ్ అన్నారు.
దర్యాప్తులోకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు కూడా లాగుతున్నారని, ప్రధాని మోడీ, ట్రంప్ పేర్లు కూడా ఇందుకు ఎందుకు లాగకూడదు.? అని వ్యంగ్యంగా స్పందించారు. దర్యాప్తు చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దని అన్నారు.
ఏంటి ఈ కేసు..?
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత, 2020 జూన్ 8న ముంబైలోని ఓ భవనం పైనుంచి పడి దిశా సాలియన్ మరణించారు. ఈ సమయంలో యాక్సిడెంట్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్) నమోదు చేశారు. అయితే, తన కూతురిపై గ్యాంగ్ రేప్కు పాల్పడి హత్య చేశారని దిశ తండ్రి సతీష్ సాలియన్ ఆరోపించారు. దీంతో కోర్టు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఆదిత్య ఠాక్రే, డినోమోరియా, రియా చక్రవర్తితో పాటు పలువురు పోలీస్, ఫోరెన్సిక్ అధికారుల పేర్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చారు.

