Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్కు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకురాబోంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ బిల్లులపై చర్చకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, పార్లమెంట్లో చర్చ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళకు 33 శాతం రిజర్వేషన్ల కోసం మూడు కీలక బిల్లులు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఈ బిల్లులు రాజ్యంగపరమైన ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఇదిలా ఉంటే, మహిళా రిజర్వేషన్లు ఆమోదం పొందిన తర్వాత ముస్లిం మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని అఖిలేష్ యాదవ్ అన్నారు. జనాభా లెక్కల కోసం ప్రభుత్వం ఎందుకు వేచిచూడటం లేదని ప్రశ్నించారు. తన పార్టీ కుల గణనను కూడా డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.
దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. జనాభా గణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని , ప్రస్తుతం గృహ గణన పనులు జరుగుతున్నాయని, జనాభా గణన జరిగినప్పుడు కుల గణన కూడా చేర్చుతామని ఆయన చెప్పారు. మత ఆధారిత రిజర్వేషన్ల ఆలోచనను అమిత్ షా తిరస్కరించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. అఖిలేష్ యాదవ్ డిమాండ్లపై విమర్శలు చేస్తూ.. అఖిలేష్ యాదవ్ తన పార్టీ టికెట్లన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వొచ్చని, ఆయన పార్టీకి ఎలాంటి సమస్యల ఉండదని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అమిత్ షా వ్యాఖ్యాలపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ముస్లిం మహిళు జనాభాలో సగం మంది అని చెబుతూ, వారు జనాభాలో భాగం కాదా? అని ప్రశ్నించారు.