దేశ రాజధాని ఢిల్లీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం వరకు ఎండలు మండిపోయాయి. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. అంతగా వేడిగాలులతో నగర వాసులు ఇబ్బందిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయింది. దీంతో చల్లని గాలులు వీచడంతో ఉల్లాస భరితంగా మారిపోయింది.
ఎప్పుడూ మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయి నగర వాసులు.. తాజాగా చలి యూ-టర్న్ తీసుకోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దీంతో 2020 మార్చి 8 నాటి రికార్డును మార్చి 20న ఆరేళ్ల తర్వాత బద్దలైంది. రెండు రోజుల నుంచి సాధారణం కంటే 22 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
సహజంగా మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన వేడి గాలులు ఉంటాయి. అధిక విద్యుత్ అవసరం ఉంటుంది. ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువ వాడడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రకృతిలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో తిరిగి దుప్పట్లు, కంబళ్లు బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈసారి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి భారతదేశం వరకు దాదాపు 1,000 కిలోమీటర్ల మేర ఒక సరళ ద్రోణిని విస్తరించి ఉంది. అంతేకాకుండా ఎత్తైన ప్రదేశాల్లోని మంచు గాలులు, అనేక చిన్న, పెద్ద తుఫాను వలయాల కలయిక వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ కారణంగానే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుండగా.. ఢిల్లీతో సహా మైదాన ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి.
ఇక మార్చి 21 నుంచి ఆకాశం క్రమంగా ఉంటుందని.. సూర్యుడు యధావిధిగా ప్రకాశిస్తాడని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 22వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమవుతాయని.. మార్చి 23 నుంచి 26వ తేదీ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని అంచనా వేసింది.
