Delhi: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం.. మహేశ్‌కుమార్ ఎన్నిక

  • ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం
  • మహేశ్‌కుమార్ ఖిచి 3 ఓట్ల తేడాతో ఎన్నిక
Delhi

Delhi

వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు. ఢిల్లీ తదుపరి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక కోసం ఆప్‌-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్‌ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్‌ ఖిచికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప మెజార్టీతో ఆప్‌ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి మూడో మేయర్‌గా మహేశ్‌ ఖిచి రికార్డు సృష్టించారు.

ఆప్‌ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, ఎన్‌డీ గుప్తా, బీజేపీకిచెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. నిరసనగా కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సబిలా బేగమ్‌ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక కొత్తగా ఎన్నికైన మేయర్‌ ఐదు నెలలు మాత్రమే పదవిలో ఉంటారు.