ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరుతూ పిల్ వేసిన పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు పెట్టింది. అసలు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యమే పూర్తిగా తప్పు అని ధర్మాసనం పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అలాగే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలన్న డిమాండ్ను కూడా కోర్టు తిరస్కరించింది.ఈ పిటిషన్ పూర్తిగా అపార్థంపై ఆధారపడి ఉందని.. దీనికి ఎలాంటి అర్హత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కఠినమైన వ్యాఖ్యలు
విచారణ సమయంలో ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయమని ఎన్నికల కమిషన్ (ECI)ని ఆదేశించడానికి ఏదైనా నిబంధన ఉందా అని కోర్టు పిటిషనర్ న్యాయవాదిని అడిగింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అటువంటి స్పష్టమైన నిబంధన ఏదీ లేదని న్యాయవాది అంగీకరించారు. కొంతమంది పార్టీ నాయకుల ప్రవర్తనపై అభ్యంతరాల కారణంగా ఒక పూర్తి రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ను ఎలా రద్దు చేయగలరని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ ఏ నిర్దిష్ట చట్టపరమైన నిబంధనపై ఆధారపడి ఉందని కూడా కోర్టు నిలదీసింది.
రాజకీయ నాయకులు కోర్టు విచారణలను బహిష్కరించడం, తదనంతరం పత్రికా సమావేశాలు నిర్వహించడం ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని, కోర్టును అవమానించడమేనని పిటిషనర్ వాదించారు. ఎవరైనా కోర్టు ధిక్కరణకు పాల్పడితే.. కోర్టు ధిక్కరణ చట్టం కింద పరిహారం పొందవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకానీ ఒక వ్యక్తి ధిక్కారానికి పాల్పడినట్లు రుజువైనంత మాత్రాన.. అతడిని ఎన్నికలలో పోటీ చేయకుండా ఆటోమేటిక్గా నిషేధించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
అసలేం జరిగిందంటే…
గత ఫిబ్రవరి 27న ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సహా పలువురిని నిర్దోషులుగా తేల్చుతూ ట్రయల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ దగ్గరకు వెళ్లింది. అయితే స్వర్ణ కాంత శర్మ ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న న్యాయమూర్తి అని.. ఆమె వల్ల తమకు న్యాయం జరగదని.. దీంతో విచారణకు హాజరు కాబోమని కేజ్రీవాల్, సిసోడియా తేల్చి చెప్పారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద పార్టీని, కేజ్రీవాల్ను బహిష్కరించాలని పిటిషన్ వేయగా.. న్యాయస్థానం కొట్టేసింది.
