Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్‌ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట

  • చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే తొలి శుభవార్త
  • ఏఎన్‌ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
  • భారత్‌లో తొలి కీలక తీర్పు
Delhihighcourt

Delhihighcourt

చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే తొలి శుభవార్త అందింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ (ANI) కాపీరైట్ కంటెంట్‌ను వినియోగించినందుకు ఓపెన్‌ఏఐ (OpenAI)పై దాఖలైన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏఎన్‌ఐ వార్తలను చాట్‌జీపీటీ శిక్షణ కోసం ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కాదని కోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధ (AI) మోడళ్ల శిక్షణ కోసం కాపీరైట్ ఉన్న వార్తా కంటెంట్ వినియోగంపై భారతదేశంలో వెలువడిన తొలి కీలక న్యాయ తీర్పుగా ఇది నిలిచింది.

జస్టిస్ అమిత్ బన్సాల్ ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. చాట్‌జీపీటీ ఏఎన్‌ఐ వార్తలను గుర్తుంచుకుని యథాతథంగా వినియోగదారులకు తిరిగి అందిస్తోందని ఏఎన్‌ఐ నిరూపించలేకపోయిందని పేర్కొంది. అందువల్ల ఓపెన్‌ఏఐపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు నిలబడవని స్పష్టం చేసింది. ఏఎన్‌ఐ వార్తలను ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు నిల్వ చేయడం కాపీరైట్ చట్టంలోని ‘ఫెయిర్ డీలింగ్’ మినహాయింపులో భాగంగా పరిగణించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. పరిశోధన ప్రయోజనాల కోసం కంటెంట్‌ను వినియోగించడం చట్టబద్ధమేనని, అందువల్ల ఈ చర్య కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని న్యాయస్థానం పేర్కొంది.

ఏఎన్‌ఐ ఆరోపణలేమిటి?

2024 నవంబర్‌లో ఏఎన్‌ఐ ఢిల్లీ హైకోర్టులో ఓపెన్‌ఏఐపై కాపీరైట్ దావా వేసింది. తమ అనుమతి లేకుండానే ప్రచురించిన వార్తా కథనాలను ఏఐ మోడళ్ల శిక్షణ కోసం ఉపయోగించిందని, అంతేకాకుండా చాట్‌జీపీటీ కొన్నిసార్లు తప్పుడు వార్తలను కూడా ఏఎన్‌ఐ పేరుతో ఆపాదించిందని ఆరోపించింది.

భారత్‌లో తొలి కీలక తీర్పు

కాపీరైట్ ఉన్న వార్తా కంటెంట్‌ను ఏఐ సంస్థలు లైసెన్స్ తీసుకోకుండా శిక్షణ కోసం ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై భారత న్యాయస్థానం ఇచ్చిన తొలి ముఖ్యమైన తీర్పు ఇదే. ఇదే అంశంపై ఓపెన్‌ఏఐపై అమెరికా, కెనడా కోర్టుల్లో కూడా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.