అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీహార్ లో హింసాత్మక ఘటనలు తగ్గడం లేదు. శనివారం భారత్ బంద్ కు బీహార్ విద్యార్థులు పిలుపునిచ్చారు. శనివారం కూడా చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటలను జరిగాయి. మరోవైపు బీజేపీ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లే .. అగ్నిపథ్ ను కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా దేశంలో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు, విధ్వంస ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి అత్యున్నత సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి రక్షణ మంత్రి నివాసానికి చేరుకున్నారు. కాగా మరోసారి ‘ అగ్నిపథ్ స్కీమ్ ’పై త్రివిధ దళాల అధిపతులతో చర్చించనున్నారు. ఈ స్కీమ్ కింద మరి కొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అగ్నివీరుల కోెసం సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో 10 శాతం రిజర్వేషన్ కల్పిండటంతో పాటు మూడేళ్లు వయోపరిమితి సడలింపులు ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా గ్లోబల్ సమ్మిట్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అందరితో చర్చించే అగ్నిపథ్ నిర్ణయం తీసుకున్నామని.. ఈ పథకం కింద ఇటు యువతకు, అటు సైన్యానికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. నాలుగేళ్ల తరువాత అగ్నివీరులకు మరిన్ని ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని.. ఇతర ఫోర్సెస్ లో అవకాశం కల్పించడంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు వర్తించేలా చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు.