భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, జీతం, పెన్షన్ బిల్లులను తగ్గించడంతో పాటు ఆధునాతన ఆయుధాలను సేకరణ కోసం నిధులను ఖర్చు చేయాలనే లక్ష్యంతో అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, దేశ త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. రాజ్ నాథ్ సంగ్ ఇది చారిత్రక నిర్ణయం అని అన్నారు.
అగ్నిపథ్ పథకంలోని ముఖ్యాంశాలు:
పథకం కింద 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసు ఉన్న 45,000 మంది యువతీయువకులను నాలుగేళ్ల కాలానికి ఆర్మీ సర్వీసుల్లోకి తీసుకోనున్నారు. రానున్న 90 రోజుల్లో నియామకాలు ప్రారంభం అవుతాయని త్రివిధ దళాల అధిపతులు ప్రకటించారు. ఈ పథకం కింద జూలై 2023 నాటికి తొలి బ్యాచ్ సిద్ధం చేయనున్నారు.
ఈ పథకానికి ఎంపికైన వారిని అగ్నివీర్ లుగా పిలువనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఎంపిక జరపనున్నారు. సాధారణంగా ఆర్మీలో ఉండే విద్యార్హతలకు అనుగుణంగానే అగ్నివీర్ల విద్యార్హత ఉంటుందని ఆర్మీ తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద మహిళలను కూడా చేర్చుకుంటామని నేవీ చీఫ్ అడ్మినరల్ ఆర్ హరి కుమార్ తెలిపారు. అగ్నివీర్లను శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఆర్మీ సేవల్లోకి తీసుకుంటామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు.
ఈ నాలుగేళ్ల పదవీకాలంలో ఆరు నెలల శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో అగ్నివీర్లకు నెలకు రూ. 30,000-40,000, అలవెన్సులు కూడా చెల్లించనున్నారు. వైద్య, బీమా ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి. నాలుగేళ్లు పూర్తి అయిన తర్వాత, ఈ సైనికుల్లో కేవలం 25 శాతం మాత్రమే సైన్యంలో పనిచేయనున్నారు. వీరంతా రెగ్యులర్ క్యాడర్, నాన్ -ఆఫీసర్ ర్యాంకులో పూర్తిగా 15 ఏళ్ల పాటు సేవలు అందించనున్నారు. మిగిలిన వారు రూ. 11 లక్షల- రూ. 12 లక్షల ప్యాకేజీతో సేవల నుంచి నిష్క్రమించనున్నారు. వీరికి పెన్షన్ వంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు. విధి నిర్వహణలో గాయం, ప్రాణనష్టం, అంగవైకల్యం ఏర్పడితే వాటికి సంబంధించిన నిబంధనలు కూడా రూపొందించినట్లు సైన్యాధ్యక్షులు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం విజయవంతం అయితే రక్షణ బడ్జెట్ లో రూ. 5.2 లక్షల కోట్లలో సగం వాటా పెన్షన్ బిల్లులలో కోతపడుతుంది. ఈ పథకం వల్ల యువత మరింత మెరుగుపడుతుందని..మరింతగా సాంకేతిక అవగాహన కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.