మరోసారి కరోనా మహమ్మారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు కరోనా ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై విరుచుకుపడి థర్డ్ వేవ్ను సృష్టించింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశాయి. అంతేకాకుండా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధించి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా అరికట్టాయి. అయితే కొత్త కొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్లో సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లోని ఎల్452ఆర్ మ్యుటేషన్తో ఇప్పటికే చైనాలో భారీగా కేసులు నమోదువుతున్నాయి.
అంతేకాకుండా ఈ మ్యుటేషన్కు చెందిన కరోనా కేసులు ఇప్పటికే భారత్లో నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు సంఖ్య నిన్నటికంటే నేడు 50 శాతం పెరిగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం ఢిల్లీలో 202 కేసులు నమోదు కాగా, నేడు 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 2.9 శాతానికి పెరిగింది. అయితే కరోనా కేసుల పెరుగుదలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. కరోనా పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తున్నామని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని వెల్లడించారు. కరోనా కేసుల సంఖ్య పెరిగితే నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.