Site icon NTV Telugu

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్.. పిటిషన్ వేస్తామన్న జైరాం రమేష్

Waqfamendmentbillcongress

Waqfamendmentbillcongress

వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక బిల్లు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే చట్టంగా మారనుంది. బిల్లు చట్టంగా మారకముందే సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లును సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయబోతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

బుధవరం లోక్‌సభలో.. గురువరం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభలో 288 మంది సభ్యులు మద్దతుగా.. 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక రాజ్యసభలో 128 మంది సభ్యులు అనుకూలంగా.. 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఉభయ సభల్లో సులువుగానే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.

భారత రాజ్యాంగంలో ఉన్న సూత్రాలు, నిబంధనలను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని.. అన్ని రకాల దాడులను ప్రతిఘటిస్తామని జైరం రమేష్ పేర్కొన్నారు. ఈ బిల్లు కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అని తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా.. దేశ విభజన కోసమే ఈ బిల్లును బీజేపీ తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకుని కార్పోరేట్ సంస్థలకు అప్పగించడమే ఈ బిల్లుకు యొక్క లక్ష్యమని ఆయా పార్టీలు ధ్వజమెత్తాయి. కాంగ్రెస్, టీఎంసీ, డిఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు సహా అనేక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ బిల్లును ఆరోపించారు. వారిలో కొందరు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Ram Charan : డైరెక్టర్ ‘బుచ్చిబాబు’కు చరణ్ దంపతుల స్పెషల్ గిఫ్ట్..

ఇక ఈ బిల్లును కేంద్రం సమర్థించింది. ముస్లింల ప్రయోజనాల కోసమే ఈ బిల్లు తీసుకొచ్చినట్లు పేర్కొంది. ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందనే ఆరోపణలను మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. ఈ బిల్లుతో ముస్లింలకే లాభమని.. బిల్లు ఆమోదంతో ముస్లిమేతరులు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేరని పేర్కొన్నారు. అయినా ఈ బిల్లు మతానికి సంబంధించింది కాదని.. ఆస్తి, దాని నిర్వహణకు, అవినీతిని నిర్మూలించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు.

 

Exit mobile version