PM Modi: ప్రధాని నరేంద్రమోడీపై సభలో భౌతిక దాడికి దిగాలని కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోడీపై శారీరక దాడికి ప్లాన్ చేసిందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ఆయన స్పీచ్ రద్దు చేయబడినట్లు తెలిపారు. అయితే ఈ వాదనల్లో నిజం లేదని కాంగ్రెస్ చెబుతోంది. మహిళా ఎంపీలు ఒక ప్రధానిపై దాడికి ఎలా కుట్ర పన్నుతారని ప్రశ్నించారు.
నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ లోక్సపభలో మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రధాని సభకు రాకముందే కాంగ్రెస్ ఎంపీలు నిరసన కొనసాగించారు. ప్రతిపక్షాలకు చెందిన 8-9 మంది మహిళా ఎంపీలు ‘‘ Do what is right’’ అనే ప్లకార్డులు పట్టుకుని లోక్సభలో ప్రధాని మోడీ కుర్చీని ముట్టడించారు. కొంత మంది మంత్రులు వారిని వెళ్లిపోవాలని కోరిన తర్వాత మహిళా ఎంపీలు తమ ముట్టడిని విమరించుకున్నారు. చివరకు లోక్సభ వాయిదా పడింది. ప్రధాని ప్రసంగం రద్దు చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగాన్ని వాయిదా వేయడం అనూహ్య నిర్ణయమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read Also: T20 World Cup Controversy: “థాంక్యూ పాకిస్థాన్”.. పాక్ నిర్ణయంపై బంగ్లాదేశ్ రియాక్షన్..
దీనిపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రతిపక్ష ఎంపీలు పీఎం మోడీ కుర్చీని ముట్టడించే అవకాశం ఉందని ముందే సమచారం వచ్చిందని, అందుకే తాను స్వయంగా మోడీని సభకు రావద్దని సూచించినట్లు చెప్పారు. కొందరు ఎంపీలు తప్పుగా ప్రవర్తించినట్లు స్పీకర్ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు. ప్రధాని ఆరోపణల్ని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని చెప్పింది. ప్రధాని మోడీ ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారని కాంగ్రెస్ ప్రతిదాడి చేసింది. డీఎంకే కూడా మిత్రపక్షం కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. రాహుల్ గాంధీ ప్రచారానికి బీజేపీ, ప్రధాని మంత్రి భయపడ్డారని డీఎంకే ఎంపీ ఎ శరవణన్ అన్నారు. మరోవైపు, బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి మాట్లాడుతూ.. ‘‘ నక్సలైట్లు ఇలాగే ప్రవర్తించేవారు. ప్రజాస్వామ్యం ముసుగులో వారు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు ఆచరించేవారు. కాంగ్రెస్ ఎంపీలు ఇలాగే ఆలోచిస్తే ప్రమాదం’’ అని అన్నారు.
