తన ముక్కుసూటి మాటలతో కాంగ్రెస్ పార్టీని తరచుగా ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలను ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమ సొంత పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా సూచించారు. ఆపరేషన్ సింధూర్తో సహా పలు అంశాలపై థరూర్ గతంలో ప్రధానమంత్రిని ప్రశంసించారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయాన్ని అంగీకరించినప్పటికీ, మరో మూడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఆ పార్టీ నిరాశాజనకమైన పనితీరును కనబరిచిందని పేర్కొంటూ, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు.
బెంగాల్, అస్సాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా అనుసరించిన సమర్థవంతమైన ఎన్నికల వ్యూహాన్ని థరూర్ ప్రశంసించడంతో పాటు, వారి నిర్వహణా నైపుణ్యాలను కూడా కొనియాడారు. “వారు (ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా) బెంగాల్, అస్సాంలో మంచి పని చేశారు. వారికి బలమైన నిర్వహణా సామర్థ్యాలు ఉన్నాయి. మనమందరం దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు,” అని థరూర్ తెలిపారు.
బెంగాల్లో తొలిసారిగా, అస్సాంలో మూడోసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం. తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది.
