CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..

  • రోడ్డు నమాజ్ చేయడానికి కాదు..
  • యూపీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..
  • రద్దీ ఎక్కువైతే షిప్టుల్లో నమాజ్ చేసుకోవాలి..
  • ఇదే విషయాన్ని చెప్పిన జమాత్ అధ్యక్షుడు..
Yogi

Yogi

CM YOGI: బక్రీద్ పండగకు ముందు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘వీధుల్లో, రోడ్లపై నమాజ్ చేయకూడదు’’ అని సోమవారం బరేలీలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. 28వ తేదీన రాబోయే ఈద్ పండుగను దృష్టిలో ఉంచుకుని, నమాజ్‌ను షిఫ్టులలో చేయాలని, వీధుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని సీఎం యోగి పేర్కొన్నారు.చట్టం అందరికి సమానమని, జనాలు అధిక సంఖ్యలో ఉంటే విడతల వారీగా వారికి కేటాయించిన మతపరమైన ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. రోడ్లు నడవడానికి ఉన్నాయని, రోడ్డును అడ్డుకునే హక్కు ఎవరి లేదని ఆయన చెప్పారు.

సీఎం యోగి వ్యాఖ్యలపై అఖిల భారత ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ స్పందించారు. సీఎం చేసిన ప్రకటననే ఇస్లాం ప్రతిబింబిస్తుందని అన్నారు. ముస్లింలు శాంతి, ప్రశాంతత పొందడానికి మసీదులు, ఇళ్లలో ప్రార్థలు చేస్తారు. షరియా ప్రకారం రద్దీ పెరిగితే, ట్రాఫిక్ అంతరాయాలను నివారించడానికి ఇమామ్‌లను మార్చడం, రెండు మూడు షిఫ్టుల్లో నమాజ్ చేయడం అనే పద్ధతిని ఇస్లాం స్వయంగా నిర్దేశిస్తుందని అన్నారు. ఇదే విధంగా బక్రీద్ రోజు సంప్రదాయంగా వచ్చే బలి కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు.నిషేధిత జంతువులను బలి ఇవ్వొద్దని ముస్లిం సమాజాన్ని కోరారు.