NTV Telugu Site icon

CM Yogi Adityanath: ఆర్ఎస్ఎస్ చీఫ్‌ని కలవనున్న సీఎం యోగి.. ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామం..

Yogi, Mohan Bagwat

Yogi, Mohan Bagwat

CM Yogi Adityanath: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు , ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. గురువారం గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యకర్త శిబిరానికి భగవత్ హాజరయ్యారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు సీఎం యోగి, మోహన్ భగవత్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.

బీజేపీపై ఆర్ఎస్ఎస్ బయటికి చెప్పకున్నా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరసగా ఆర్ఎస్ఎస్ నేతలు బీజేపీ అహంకారంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మణిపూర్ సమస్యపై సోమవారం మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతి నెలకొనలేదని కేంద్రాన్ని పరోక్షంగా విమర్శించారు. ప్రజాసేవలో వినయంగా వ్యవహరించాలని అన్నారు. ఇదిలా ఉంటే మరోనేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. అహంకారులుగా వ్యవహరించిన వారిని 241 వద్దే శ్రీరాముడు అడ్డుకున్నాడని అన్నారు.

Read Also: Sehwag-Shakib: సెహ్వాగ్‌ ఎవరో నాకు తెలియదు.. షకీబ్‌ అల్ హసన్ కౌంటర్‌!

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బీజేపీకి మద్దతు తెలపలేదని తెలుస్తోంది. సైద్ధాంతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్‌ని బీజేపీ పట్టించుకోకపోవడంతోనే ఇది జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ పరాజయానికి ఇది ఓ కారణంగా చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 36 సీట్లను సాధించింది. బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)- కాంగ్రెస్ ఇండియా కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. అయోధ్య రామాలయాన్ని నిర్మించిన ఫైజాబాద్ ఎంపీ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది.

ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు బీజేపీని మెజారిటీ మార్కుకు దూరం చేశాయి. గత రెండు పర్యాయాలు 2014, 2019లో బీజేపీ యూపీలో 60+కి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ మెజారిటీ మార్క్(272)ని దాటింది. ఈసారి మాత్రం బీజేపీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. అయితే, ఎన్డీయే కూటమి మొత్తంగా 293 స్థానాలు సాధించింది. అధికారం కోసం టీడీపీ, జేడీయూ, శివసేనలపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ కాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.