అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతి ఏడాది సివిల్స్ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల దశల్లో ఉద్యోగులను భర్తీ చేస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భాగంగా మెయిన్స్కు సంబంధించిన ఫలితాలను గురువారం సాయంత్రం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పలు సర్వీసు అధికారులుగా ఎంపిక అవుతారు.
సివిల్ సర్వీసెస్-2021లో భాగంగా ప్రిలిమ్స్లో మెరిట్ సాధించిన వారిని మెయిన్స్కు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెయిన్స్ ఫలితాలు కూడా విడుదలైపోగా.. ఈ ప్రక్రియలో తుది అంకమైన ఇంటర్వ్యూలకు 1,823 మంది ఎంపికైనట్లుగా యూపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 5 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.