Suvendu Adhikari: బంగ్లాదేశ్ కస్టడీలో ఉన్న హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ అంశాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రస్తావించారు. చిన్మోయ్ తన తల్లి అంత్యక్రియలకు హాజరైన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు పడుతున్న కష్టాలను ఈ కన్నీళ్లు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం కేవలం 5 గంటల పెరోల్ ఇచ్చి, తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించింది.
ఇదిలా ఉంటే, ఈ అంశంపై సువేందు అధికారి మట్లాడుతూ.. తన తల్లి అంత్యక్రియలకు హాజరైన సమయంలో చిన్మోయ్ కృష్ణదాస్ పెట్టుకున్న కన్నీళ్లు ప్రపంచవ్యాప్తంగా సనాతనవాదుల్ని కదిలించాని అన్నారు. బెంగాల్ విభజన, హిందువుల భద్రతకు సంబంధించిన చారిత్రక అంశాలను అధికారి ప్రస్తావించారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ, స్వామి ప్రణవానంద వంటి నేతల పోరాటం వల్ల బెంగాల్లో కొంత భాగం భారత్లో విలీనం అయిందని అన్నారు. ఒక వేళ విలీనం కాకపోయి ఉంటే, ఈ రోజు మన పరిస్థితి కూడా చిన్మోయ్ కృష్ణదాస్ పరిస్థితి లాగే ఉండేదని అన్నారు.
తన కుటుంబం బెంగాల్ విభజన సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల్ని సువేందు అధికారి వెల్లడించారు. తన తల్లి గాయత్రీ దేవీ కుటుంబం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉండేదని, దేశ విభజన సమయంలో హిందువులు కావడం వల్ల తమ తల్లి, తాత భారత్కు వలస రావాల్సి వచ్చిందని అన్నారు. కట్టుబట్టలతో తన తల్లి, అన్నింటిని వదిలేసి మా నాన్నతో పారిపోయి రావాల్సి వచ్చిందని అన్నారు.
బెంగాలీ హిందువుల కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ, స్వామి ప్రణవానంద చేసిన కృషిని వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలు మరిచిపోయేలా చేశాయని సువేందు ఆరోపించారు. బెంగాల్ సంస్కృతిని దూరం చేసిందని అన్నారు. దుర్గాపూజ, మహాలయ వంటి సంప్రదాయాల విషయంలో ఇదే తరహా సిద్ధాంతపరమైన వైఖరిని అవలంభించాయని ఆరోపించారు. టీఎంసీ తన పాలనలో బెంగాల్ను ‘‘జమాతీకరించేందుకు’’ ప్రయత్నించిందని అన్నారు.

