China: భారత్ పట్ల చైనా తన వైఖరిని మార్చుకుంటోంది. ఇప్పుడు స్నేహం అంటూ చిలకపలుకులు పలుకుతోంది. భారత్, చైనాలు ప్రత్యర్థులు లేదా వ్యతిరేక శక్తులు కాదని, ఒకరి అభివృద్ధికి మరొకరు ముప్పుగా కాకుండా అవకాశాలుగా నిలిచే సహాకర భాగస్వాములు అని చైనా చెప్పింది. సోమవారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలతో రష్యాకు ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యల తర్వాత డ్రాగన్ కంట్రీ నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి.
భారత్, చైనాలు ‘‘సహకార భాగస్వాములు’’ అభివర్ణించిన లిన్ జియాన్, ప్రస్తుతం రెండు దేశాల సరిహద్దుల్లో సాధారణ స్థితి ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సమాచార మార్గాలు సజావుగా ఉన్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాలు రెండు దేశాలకే కాకుండా మొత్తం ఆ ప్రాంతానికి చాలా ముఖ్యమైనవి అని అన్నారు. ఇరు పక్షాల సంబంధాలు వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ఆయన తెలిపారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని చైనా చెప్పింది.
రష్యా, భారత్, చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ.. మూడు వర్థమాన దేశాలని, ఈ దేశాల మైత్రి ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ప్రయోజనకరమని అన్నారు. దీనికి ముందు రష్యా అధ్యక్షుడు భారత్-చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా సున్నితమైనవిగా, బహుముఖమైనవిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య మూడో పక్షం జోక్యం చేసుకోవడం తగదని ఆయన అన్నారు. రష్యాకు రెండు దేశాలు మిత్రలే అని చెప్పారు. సరిహద్దు వివాదం వంటి సున్నితమైన అంశాలతో సహా పరస్పర ఆసక్తి ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించడానికి మోడీ, జిన్ పింగ్ కృషి చేస్తున్నట్లు చెప్పారు.

