కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్పర్సన్ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్కు అప్పగించింది. క్యాపిటల్ మార్కెటింగ్ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్పర్సన్గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
కాగా మూడేళ్ల పాటు మాధవి పూరీ బుచ్ నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకులో తన కెరీర్ను ప్రారంభించిన మాధవి.. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆ గ్రూప్లో పనిచేశారు. అదే సమయంలో 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే మధ్య కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్కు ఎండీగా, సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహించారు.