BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!

  • సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం
  • భారత్ ఆతిథ్యమిస్తున్న సదస్సుకు పుతిన్, జిన్‌పింగ్ హాజరు
  • ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం
  • మోదీ-పుతిన్, మోదీ-జిన్‌పింగ్ భేటీలపై ప్రపంచ దేశాల దృష్టి
Brics (1)

Brics (1)

BRICS Summit 2026: భారత్ మరోసారి అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికగా మారుతోంది. న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ సమావేశారు జరగనున్నాయి.  భారత్ 2012లో తొలిసారి బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. 2016, 2021లో కూడా సమావేశాలకు భారత్ వేదికగా మారింది. 2026లో మరోసారి న్యూఢిల్లీలో సమావేశాలు జరుగబోతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా బ్రిక్స్ సభ్య దేశాధినేతలు, అనేక మంది దౌత్యవేత్తలు, అధికారులు హాజరుకాబోతున్నారు. దీంతో ఈ సమావేశాలపై ప్రపంచం దృష్టి నెలకొంది.

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా యుద్ధం కూడా సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో మూడు ప్రధాన శక్తులైన రష్యా, చైనా, భారత్ ఈ సమావేశాల్లో కీలకం కాబోతున్నాయి. దీంతో సహజంగానే ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

మోడీ-పుతిన్, మోడీ-జిన్‌పింగ్ సమావేశాలపై ఆసక్తి..

బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. అదే సమయంలో గల్వాన్ ఘర్షణల తర్వాత, 7 ఏళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్ పర్యటనకు వస్తుండటం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రెండు దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇప్పుడిప్పుడే భారత్-చైనాల మధ్య సరిహద్దు చర్చలు కొలిక్కివస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో రెండు దేశాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. గతంలో పలు సందర్భాల్లో ‘‘డ్రాగన్-ఎలిఫెంట్ డ్యాన్స్’’ చేయాలంటూ జిన్‌పింగ్ భారత్‌కు స్నేహహస్తాన్ని అందించారు.

రష్యాతో భారత్‌కు దశాబ్ధాలుగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. పుతిన్-మోడీ హయాంలో ఈ సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరాయి. ఉక్రెయిన్ యుద్ధం రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. ఇక రష్యా, భారత్ మధ్య పలు రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ బ్రిక్స్:

ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం, సౌదీపై హౌతీల దాడులు జరుగుతున్న ఈ సమయంలో బ్రిక్స్ సమావేశాలు కీలకంగా మారాయి. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు భారత్ ఇప్పటికే మద్దతు ఇచ్చింది. ఇటీవల SCO శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధానికి ముగింపు పలికి శాంతి దిశగా ప్రపంచం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ వేదిక నుంచి కూడా ప్రపంచానికి శాంతి, సహకారం, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు సంబంధించిన సందేశం వెలువడే అవకాశం ఉంది.