BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..

  • మరో 20 ఏళ్లు బీజేపీదే హవా..
  • కాంగ్రెస్ రికవరీ ఇప్పట్లో కష్టమే..
  • యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా..
Bjp

Bjp

BJP: భారతదేశంలో బీజేపీ హవా 20 ఏళ్లు కొనసాగుతుందని ప్రముఖ పోల్‌స్టర్, యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అన్నారు. సమర్థవంతమైన పాలన అందించే వారి సామర్థ్యంపై ఇది ఆధారపడుతుందని చెప్పారు. బీజేపీ పాలన పనితీరు గణనీయంగా బలహీనపడనంత కాలం ఆ పార్టీ స్థానం సురక్షితంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ అనుభవించిన సుదీర్ఘ ఆధిపత్యాన్ని, ఇప్పుడు బీజేపీ అనుభవిస్తోందని చెప్పారు. భారతదేశంలో ఏక-పార్టీ ఆధిపత్య పరిస్థితులను చూస్తున్నామని అన్నారు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో ఒక కాలపరిమితి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ 1977 వరకు నిరంతరం పాలించింది. ఆ తర్వాత ఇబ్బందుల్ని ఎదుర్కొవడం ప్రారంభించింది. ఒక రాజకీయ తరం సుమారు 20 ఏళ్లు ఉంటుందని మనం భావిస్తాం. ఇప్పుడు బీజేపీ కూడా దీనినే అనుభవిస్తోంది’’ అని ఆయన చెప్పారు. బీజేపీ సుదీర్ఘకాలం పాటు భారత రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ భవిష్యత్తు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. భారీ మెజారిటీ పొందిన తర్వాత బీజేపీపై కూడా అంచనాలు పెరిగిపోయాయని, దీనికి అనుగుణంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అద్భుతంగా రాణించాల్సి ఉంటుందని చెప్పారు. బీజేపీ బలహీనపడనంత కాలం గెలుస్తూనే ఉంటుందని, ప్రతిపక్షం ఓడిపోతూనే ఉంటుందని చెప్పారు.

వారసత్వ సమస్యల భారాన్ని కాంగ్రెస్ ఇంకా ఎదుర్కొంటూనే ఉందని అన్నారు. గత పాలనపై ఏర్పడి నెగిటివ్ అభిప్రాయాలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌కు ఇంకా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నాటికి కాంగ్రెస్‌కు అధికారం దూరమై 15 ఏళ్లు పూర్తవుతుంది, దేశవ్యాప్తంగా ప్రజల్ని మళ్లీ నమ్మించే స్థాయికి రావడానికి మరో 5 ఏళ్లు పట్టొచ్చు అని ఆయన తెలిపారు. బీజేపీ ఆధిపత్యం 2034 వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు.