Bengal Exit Poll: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీకి ఎన్నికలు ముగిశాయి. అయితే, దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి చూపిస్తున్నారు. మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేక బీజేపీ అధికారంలోకి వస్తుందా? అని ఆలోచిస్తున్నారు. బుధవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారం చేపట్టవచ్చని అంచనా వేశాయి. ఒకటి రెండు ఎగ్జిట్ పోల్ సంస్థలు మళ్లీ టీఎంసీ అధికారం చేపడుతుందని చెప్పాయి.
Read Also: Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
ఇదిలా ఉంటే, ప్రముఖ సంస్థ ‘‘యాక్సిస్ మై ఇండియా’’ మాత్రం బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అంచనాలను ఇవ్వలేదు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ సర్వేకు ఓటర్లు స్పందించలేదని చెప్పారు. ఓటర్ల నాడిని పసిగట్టలేకపోయామని, ఓటర్లు తాము ఎవరికి ఓటేశామనే విషయాన్ని బయటకు చెప్పడం లేదని అన్నారు. తాము ప్రజల్ని ప్రశ్నించినప్పుడు 60-70 శాతం మంది ప్రజలు మౌనం వహించారని అన్నారు. అయితే, బెంగాల్ ఎన్నికల గురించి మళ్లీ గురువారం ఓటర్లను ప్రశ్నించే ప్రయత్నం చేస్తామని, ఎన్నికలు ముగియడం వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉంటారని ఆయన అన్నారు.
294 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రెండు దశల్లో కూడా ప్రజలు భారీ సంఖ్యలో బయటకు వచ్చి ఓటేశారు. రెండు దశల్లో ఓటింగ్ శాతం 90ని మించింది. అయితే, గత చరిత్రను చూస్తే బెంగాల్ ఎన్నికల్లో భారీగా హింస చోటు చేసుకుంది. హత్యా రాజకీయాలు నడిచాయి. ఇది కూడా ప్రజలు తాము ఎవరికి ఓటేశామనే విషయాన్ని చెప్పకపోవడానికి కారణంగా కనిపిస్తోంది. తమ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రజలు వెనుకాడుతున్నారు.
