Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన సాక్ష్యాలు బలంగా లేవని రౌస్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ తీర్పు తర్వాత, కేజ్రీవాల్ ప్రధాని మోడీ, అమిత్ షాలపై విరుచుకుపడ్డారు. వీరిద్దరే తనపై కుట్ర చేశారని, ఆప్ లేకుండా చేయాలని తనను జైలుకు పంపారని సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఒక వేళ ఆ ఎన్నికల్లో బీజేపీ 10 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ఈ కేసు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుట్ర అని అన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు నరకాన్ని చూస్తున్నారని అన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాలు గెలుచుకుంది. ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించింది. ఢిల్లీలో ఆప్ అధికారాన్ని తొలగించడానికి బీజేపీ కుట్ర చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు.