సహజీవనంపై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. వయోజనురాలితో వివాహితుడు సహజీవనం చేస్తే తప్పేం కాదని అని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. వివాహితుడైన పురుషుడు-వయోజనురాలైన మహిళ మధ్య పరస్పర అంగీకారంతో కూడిన సహజీవనం నేరమే కాదని న్యాయస్థానం పేర్కొంది. జంటను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. జంట భద్రతను పోలీసులే బాధ్యత తీసుకోవాలని.. వారికి పూర్తి భద్రత కల్పించాలని సూచించింది.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని జైతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2026 జనవరి 8న అనామిక (18) అనే యువతి తల్లి కాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేత్రపాల్ అనే వివాహితుడు తన కుమార్తెను ప్రలోభపెట్టి ఎత్తుకెళ్లిపోయాడని.. ఈ విషయంలో ధరంపాల్ అనే మరో వ్యక్తి సహకరించాడని ఆరోపించింది. దీంతో పోలీసులు వారిద్దరిపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 87 కింద కేసు నమోదు చేశారు. దీంతో జంట ఈ కేసును కొట్టేయాలని అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
పిటిషనర్లు అనామిక, నేత్రపాల్ దాఖలు చేసిన క్రిమినల్ రిట్ పిటిషన్పై జస్టిస్ జె.జె. మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఇద్దరం వయోజనులమని.. ఇష్టపూర్వకంగానే కలిసి జీవిస్తున్నామని అనామిక, నేత్రపాల్ జంట కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్లో కూడా అనామిక వయస్సు 18 సంవత్సరాలుగా ఉందని గుర్తుచేశారు. దీనిని బట్టి అనామిక వయోజనత్వాన్ని రుజువు చేస్తోందని వెల్లడించారు. ప్రతివాది న్యాయవాది మాట్లాడుతూ.. నేత్రపాల్కు అప్పటికే వివాహమైందని.. అందువల్ల మరో మహిళతో కలిసి జీవించడం నేరమని వాదించారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్న వయోజనులపై ఈ ప్రాతిపదికన విచారణ జరపలేమని పేర్కొంటూ.. ప్రతివాది వాదనను పూర్తిగా తిరస్కరించింది. ఇద్దరు ప్రతివాదుల తరఫు న్యాయవాదులకు కౌంటర్-అఫిడవిట్ దాఖలు చేయడానికి కోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది.
తాను ఇష్టపూర్వకంగానే నేత్రపాల్తో కలిసి జీవిస్తున్నానని అనామిక ఇప్పటికే షాజహాన్పూర్ పోలీసులకు లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఈ సంబంధాన్ని తన తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని.. తనను అవమానపరుస్తూ ‘‘పరువు హత్య’’ చేస్తామని బెదిరిస్తున్నారని అనామిక పేర్కొంది. దీంతో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నప్పటికీ.. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి నిర్దిష్ట చర్య తీసుకోకపోవడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో జంట భద్రతకు షాజహాన్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని కోర్టు పేర్కొంది. జంటను రక్షించడం పోలీసుల విధి అని స్పష్టం చేసింది
మహిళ సమ్మతితో సహజీవనం చేస్తే దానిని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. నైతికత, చట్టం అనేవి రెండు వేర్వేరు విషయాలని కోర్టు తెలిపింది. ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగనప్పుడు.. కేవలం సామాజిక కట్టుబాట్ల ఆధారంగా కేసు నమోదు చేయలేమని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు జంట అరెస్టును నిలిపివేస్తూ.. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఇక అనామిక కుటుంబానికి న్యాయస్థానం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఏ కుటుంబ సభ్యుడు కూడా జంటకు ఏ విధంగానూ హాని చేయకూడదని.. వారి ఇంట్లోకి ప్రవేశించకూడదని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఫోన్, టెక్స్ట్ మెసేజ్, లేదా మరే ఇతర మూడవ వ్యక్తి ద్వారా కూడా సంప్రదించడానికి ప్రయత్నించకూడదని హెచ్చరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 8కు న్యాయస్థానం వాయిదా వేసింది.