Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈరోజు (బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ముంబై నుంచి బారామతికి లియర్జెట్ 45 విమానంలో వెళ్లారు. అయితే, ల్యాండింగ్కు కొన్ని క్షణాల ముందు రన్ వేకు పక్కనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే పెద్ద మంటలు చెలరేగి అందులో ఉన్న ఐదుగురు మరణించారు.
అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం వేగంగా కిందికి దిగుతున్నట్లు కనిపించింది. అదే సమయంలో ఎడమ వైపు వంగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ల్యాండింగ్ కు ముందు ఇలా జరగడం అసాధారణమని ఎవియేషన్ ఎక్స్ఫర్ట్ చెబుతున్నారు. ఇది సాంకేతిక లోపం లేదా పైలట్లు విమానంలో ఏర్పడిన ఒత్తిళ్లను భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. బారామతిలోని గోజుబావి గ్రామ పంచాయతీలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. విమానం వేగంగా ఎత్తును కోల్పోతున్నట్లు గా కనిపిస్తోంది.
కొత్తగా వైరల్ అవుతున్న వీడయోలో విమానం ముందుగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. పల్టీలు కొట్టడం, వేగంగా కిందకు దూసుకు రావడం, ఆ తర్వాత నేలను బలంగా ఢీకొట్టి అగ్ని ప్రమాదం ఏర్పడటం కనిపిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, విమానం విమానాశ్రయం చుట్టూ తిరుగుతూ కనిపించిందని, ఆ సమయంలో అస్థిరంగా ఉందని, నేలను ఢీకొన్న తర్వాత పేలిపోయిందని చెబుతున్నారు.
ప్రమాదానికి ముందు రెండుసార్లు పైలట్లు ల్యాండింగ్కు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ల్యాండింగ్కు క్లియరెన్స్ వచ్చిన తర్వాత, పైలట్లు తమకు రన్-వే కనిపించడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ క్లియరెన్స్ పొందిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పైలట్లు ‘‘రీడ్ బ్యాక్’’ అందించలేదు. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్పిన ల్యాండింగ్ ప్రొసీజర్ను నిర్ధారించడం. సాధారణంగా ల్యాండింగ్ సమయంలో పైలట్లు తమకు ఇచ్చిన ఆదేశాలు అర్థమయ్యాయని చెప్పేందుకు ఇలా రీడ్ బ్యాక్ చేస్తారు.