NTV Telugu Site icon

Agnipath Scheme: మరో రెండు రోజుల్లో అగ్నిపథ్ నోటిఫికేషన్

Jpg

Jpg

కేంద్ర ప్రభుత్వం సైన్యంలో  తీసుకువచ్చిన ‘ అగ్నిపథ్ స్కీమ్’ పై ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్ తో పాటు హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ లో కూడా ఆందోళనకారులు రైల్వే స్టేషన్ లోని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభించబోతోంది. తర్వలోనే రిక్రూట్మెంట్ ప్రారంభం కానుందని.. రాబోయే 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుందని.. ఆర్మీ రిక్రూట్మెంట్ కు సంబంధించి షెడ్యూల్ ప్రకటిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. మొదటి అగ్నివీర్ బ్యాచ్ కి డిసెంబర్ నాటికి శిక్షణ ప్రారంభం అవుతుందని.. వచ్చే  ఏడాది మధ్య నాటికి ఆపరేషన్, నాన్ -ఆపరేషన్ లో అగ్నివీర్లు అందుబాటులో ఉంటారని ఆర్మీ చీఫ్ అన్నారు. అగ్నిపథ్ పథకంపై యువతకు సరైన సమాచారం తెలియదని నేను భావిస్తున్నా అని పథకం గురించి తెలిసిన తర్వాత ఈ పథకం యువతకే కాకుండా అందరికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్మీ చీఫ్ అన్నారు.

అగ్నిపథ్ స్కీమ్ కోసం గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం వల్ల  యువతకు మరింత ప్రయోజనం ఉంటుందని.. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్లు ప్రారంభం అవుతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి వెల్లడించారు.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా అగ్ని పథ్ స్కీమ్ పై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చాలా మంది ఆర్మీ ఆశావహులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అయితే ఈ స్కీమ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు ఈ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ పాత రిక్రూట్మెంట్ పథకాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి.