ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఉపహార్ థియేటర్లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. థియేటర్లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్లోని బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
అయితే 25 ఏళ్ల కిందట ఇదే థియేటర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 1997 జూన్ 13న మధ్యాహ్నం 3 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి ఘటనలో 59 మంది చనిపోయారు. ఈ ప్రమాదం వల్ల జరిగిన తొక్కిసలాటలో మరో 103 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు మొన్నటి వరకు కోర్టులో నలుగుతూనే ఉంది. 2015 ఆగస్టు 19న ఢిల్లీ కోర్టు థియేటర్ యజమాని సుశీల్ అన్సాల్ సోదరులకు రూ.30 కోట్ల చొప్పున జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్లో తుది తీర్పు వెలువరించిన కోర్టు.. ఆధారాలను నాశనం చేశారన్న ఆరోపణలపై అన్సాల్ సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష, మరో రూ.2.25 కోట్ల జరిమానా విధించింది. అయితే తాజాగా జరిగిన ఘటన తెల్లవారుజామున జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Delhi | Fire breaks out at Uphaar cinema hall, near Green Park metro station; 5 fire engines at the spot
The fire broke out in furniture lying inside the cinema hall says the Fire Department. pic.twitter.com/JBC2MSbVI4
— ANI (@ANI) April 17, 2022