Madhya Pradesh: రైతుల ఆందోళనలో ఏసీపీ మోనికా శుక్లా ధైర్యం.. సోషల్ మీడియాలో ప్రశంసలు

  • భోపాల్ రైతుల ఆందోళనలో వైరల్ అయిన ఏసీపీ మోనికా శుక్లా వీడియో.
  • కదులుతున్న బస్సు ముందు నిలబడి అడ్డుకున్న మహిళా పోలీస్ అధికారి.
  • సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు.
Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh:  మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రైతులు నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పెసర పంటను కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమించారు. సీఎం మోహన్ యాదవ్‌ నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనల నేపథ్యంలో ఏసీపీ మోనికా శుక్లా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారుల బస్సు ముందు నిలబడి అడ్డుకున్న శుక్లాపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిరసనకారులు పోలీస్ బారికేడ్లు తొలగించి, బస్సును కదిలించేందుకు ప్రయత్నించారు. ఏసీపీ మోనికా శుక్లా బస్సుకు అడ్డంగా నిలబడి, తన చేతులతో దాని కదలికను అడ్డుకున్నారు. కొంతసేపు ఉద్రిక్తతల తర్వాత నిరసనకారులు బస్సును అక్కడే వదిలేశారు.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో భోపాల్ రైతులు, పెసరపప్పును 100% కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు కొనుగోలు చేయాలని, ఇ-టోకెన్ వ్యవస్థను మెరుగుపరచాలని, మరియు సరసమైన ధరలకు ఎరువులను సకాలంలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. రైతులు నర్మదాపురం మరియు ఇతర ప్రాంతాల నుండి భోపాల్‌కు పాదయాత్ర చేసి, రాజధానిలోని వీర్ సావర్కర్ వంతెన సమీపంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం తమకు హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని చెబుతున్నారు.