Oleander Flowers: కేరళలోని రెండు ప్రధాన దేవస్వామ్ బోర్డులైన ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డ్(టీడీబీ), మలబార్ దేవస్వోమ్ బోర్డ్ల పరిధిలోని అన్ని దేవాలయాలు ‘‘ఒలియాండర్ పూలను’’ నిషేధించాయి. అరళీ పూలు, ఎర్రగన్నేరు పూలుగా పిలిచే వాటిని ఆలయాల్లో పవిత్ర ఆచారాల్లో వినియోగించడాన్ని నిలిపేశాయి. మానవులు, జంతువులకు హాని కలిగించే ప్రమాదం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. గురువారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం తమ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఈ పూలను నిషేధించినట్లుగా ట్రావెన్ కోర్ దేవస్వోమ్ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు.
టీబీడీ ఆధ్వర్యంలోని దేవాలయ నైవేద్యాల్లో, ప్రసాదాల్లో అరళీ పువ్వులను ఉపయోగించడాన్ని పూర్తిగా నివారించాలని నిర్ణయించామని, అందుకు బదులుగా తులసి, తేచి(ఇక్సోరా), మల్లె, చామంతి, గులాబీ వంటి ఇతర పువ్వులను ఉపయోగిస్తామని ప్రశాంత్ విలేకరులకు తెలిపారు. ట్రావెన్ కోర్ పరిధిలోని 1248 దేవాలయాలు, మలబార్ దేవస్వం పరిధిలోని 1400 ఆలయాల్లో ఈ అరళీ పువ్వులను వినియోగించడాన్ని నిషేధించారు.
Read Also: Amit Shah: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలకు ఇస్తాం..
నిషేధానికి కారణం ఏంటి..?
కేరళలోని అలప్పుజాలో ఒలియాండర్(అరళీ పువ్వు)పూలు తినడం వల్ల ఒక యువతి మరణించింది. దీంతో ఆలయ నైవేద్యాల్లో వీటిని నిషేధించారు. అయితే, పూజ కోసం ఈ పూలను ఉపయోగించడంపై పరిమితులు లేవు. అరళీ ఆకులను, పూలను అనుకోకుండా నమలడం వల్ల 24 ఏళ్ల సూర్యా సురేంద్రన్ అనే యువతి మరణించింది. నర్సింగ్ ఉద్యోగంలో చేరేందుకు యూకే వెళ్లేందుకు నెడుంబస్సేరి విమానాశ్రయానికి చేరిన సమయంలో అక్కడే కుప్పకూలింది. ఆమెను వెంటనే కొచ్చిలోని అంగమలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరనించింది. ఈ ఒలియాండర్ పూలలో గుండెకు హాని కలిగించే కార్డియాక్ గ్లైకోసైడ్స్ ఉంటాయి.