MK Stalin: బీజేపీలో 261 మంది రౌడీలు ఉన్నారు.. ప్రధాని మోడీపై స్టాలిన్ ఆరోపణ..

Mk Stalin

Mk Stalin

MK Stalin: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అధికార డీఎంకే, బీజేపీ మధ్య విమర్శల దాడి జరుగుతోంది. సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తమిళనాడులో శాంతిభద్రతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. అయితే, దీనికి ప్రతిస్పందనగా సీఎం స్టాలిన్ స్పందించారు. బీజేపీలో నేరచరిత్ర ఉన్న వారు 261 మంది ఉన్నారని ఆరోపించారు.

Read Also: Pakistan: ‘రెడ్ కార్పెట్’లపై నిషేధం.. ఖర్చులని తగ్గించుకోవాలని పాక్ నిర్ణయం..

సేలం డీఎంకే అభ్యర్థి టీఎం సెల్వగణపతి, కళ్లకురిచ్చి డీఎంకే అభ్యర్థి మలైయరసన్‌ల తరుపు సీఎం స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానిపై సీఎం ఎదురుదాడికి దిగారు. హిస్టరీ షీటర్లతో సహా నేరచరిత్ర కలిగిన 261 మంది నాయకులు బీజేపీలో ఉన్నారని స్టాలిన్ ఆరోపించారు. ఇలాంటి నాయకులు ఉన్న బీజేపీకి శాంతిభద్రతలపై వ్యాఖ్యానించే హక్కు లేదని ఆయన అన్నారు. బీజేపీలో ఉన్న హిస్టరీ షీటర్ల గురించి 32 పేజీల నివేదికను స్టాలిన్ చూపించారు. బీజేపీ నేతలపై మొత్తం 1977 కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.