Zombie Reddy 2: ‘సూపర్ హీరో’ తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జోంబీ రెడ్డి 2’ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘జోంబీ రెడ్డి’కి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘జాంబీ రెడ్డి: నెక్ట్స్ లెవల్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. ఎలాంటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించకుండా రూపొందించిన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ సువర్ణ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ క్రియేటర్గా వ్యవహరిస్తున్నారు.
ఈసారి మరింత భారీ స్థాయిలో ‘జోంబీ-వర్స్’ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘బిగ్గర్, బాడర్ & బ్లడియర్’ కాన్సెప్ట్తో గత చిత్రానికి మించిన వయోలెన్స్, యాక్షన్తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘డెడ్ ఆర్ అలైవ్’ అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ చిత్రం 2027లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర, షనయ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తేజ సజ్జా మరోసారి జోంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతుండటంతో ‘జోంబీ రెడ్డి 2’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

