తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్స్), గిల్డ్ నిర్మాతలకు నడుస్తున్న అంతర్గత వివాదం ఇంకా సద్దుమణగలేదు. థియేటర్స్ ని రెంట్ బేస్ మీద నడపలేమని, మొదటి రోజు నుండే తమకు షేర్ పర్సెంట్ విధానం ఉండేటివంటి పలు కీలక అంశాలపై ఇరు వర్గాల మధ్య చర్చలు నడుస్తున్నప్పటికీ ఇంకా ఒక స్పష్టమైన ముగింపు రాలేదు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఇరు వర్గాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
ఇందులో భాగంగా నిన్న థియేటర్ల ఎగ్జిబిటర్స్ ప్రతినిధి బృందం మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు సాయంత్రం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధి బృందం అత్యవసరంగా భేటీ కానుంది. ఇండస్ట్రీలోని ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో నిర్మాతలు పవన్ కళ్యాణ్కు ఒక అధికారిక వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ప్రభుత్వ పరంగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చొరవ చూపాలని డిప్యూటీ సీఎంను కోరనున్నారు. ఈ భేటీ తర్వాత టాలీవుడ్ థియేటర్ల వివాదానికి ఒక స్పష్టమైన పరిష్కారం దొరుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
