NTV Telugu Site icon

సెప్టెంబర్ కల్లా బాక్సాఫీస్ వద్దకు చేరేందుకు ‘గుడ్డి’గా బయలుదేరుతోన్న ప్రశాంత్!

దేశమంతటా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మరి ఫిల్మ్ మేకర్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంది? అందుకే, చకచకా తమ షూటింగ్స్ ని చక్కబెట్టేస్తున్నారు చాలా మంది. తమిళ హీరో ప్రశాంత్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఆయన హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నాడు. తమిళ వర్షన్ లో ఆయన ఆయుష్మాన్ ఖురానా పోషించిన గుడ్డివాడి పాత్ర చేస్తున్నాడు. అందుకే, సినిమా టైటిల్ ‘అందగన్’ అని పెట్టారు. ఇక బాలీవుడ్ లో టబు చేసిన రోల్ కోలీవుడ్ లో సిమ్రాన్ చేస్తోంది. ‘అందగన్’ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది.

జూలై 28తో లోకల్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘అందగన్’ యూనిట్ ఆగస్ట్ మధ్యలో ఫారిన్ లోకేషన్స్ కు వెళ్లనుంది. ఆ ఓవర్ సీస్ షెడ్యూల్ కూడా కంప్లీటైతే ఇక పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ తో పాటూ సమాంతరంగా ఎడిటింగ్ కానిచ్చేస్తోన్న సినిమా దర్శకనిర్మాతలు ప్రశాంత్, సిమ్రాన్ స్టారర్ ని సెప్టెంబర్ లో థియేటర్స్ కు తీసుకురానున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ రిలీజ్ కి కౌంట్ డౌన్ మాత్రం మొదలైపోయింది.

‘అంధాధున్’ తెలుగులోనూ రీమేక్ అవుతోంది. నితిన్, తమన్నా ప్రధాన పాత్రల్లో బ్లాక్ కామెడి క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతోంది. టాలీవుడ్ వర్షన్ కంటే ముందుగానే కోలీవుడ్ వర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూడాలి మరి, హిందీ తెరపై దక్కిన విజయమే దక్షిణాదిలోనూ దక్కుతుందో లేదో…