Apsara Rani: మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి తెరకెక్కిస్తున్న సినిమా ‘తలకోన’. ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రసాద్ లాబ్స్ లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ మూవీలో అందాల భామ అప్సర రాణి ప్రధాన పాత్రను పోషిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి ‘గుర్తుందా శీతాకాలం’ నిర్మాత రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా… ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘తలకోన’ చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ, ”క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు, అందులో ఇంకో కోణం కూడా ఉంటుంది. అదే విధంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. ప్రధాన కథాంశం అయితే తలకోన ఫారెస్ట్ లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు? ఎంతమంది తిరిగొచ్చారు? అనేదే ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ చిత్రాన్ని 20 రోజులు హైదరాబాద్ లో, మరో 20 రోజులు తలకొనలో షూట్ చేయబోతున్నాం” అని అన్నారు.
హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ, ”మంచి స్క్రిప్ట్స్ కు నేను ఫ్యాన్ ను. అదే ఇప్పుడు ఈ ‘తలకోన’ చిత్రం చేయడానికి కారణం అయ్యింది. నేను మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను. అవే నాకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల రికార్డింగ్ పూర్తయ్యిందని సంగీత దర్శకుడు సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్ తదితరులు పాల్గొన్నారు.