Nandamuri Balakrishna: నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య చిచ్చు రగిల్చిన వివాదం ఇప్పుడప్పుడే తెమిలేలా లేదు. ఇక ఈ విషయంపై అక్కినేని అభిమానులతో పాటు అక్కినేని నట వారసులు కూడా స్పందించారు. దీంతో అక్కినేని అభిమానులు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కినేని అభిమానులు తమతో పాటు ఎస్వీ రంగారావు కుటుంబాన్ని కూడా అవమానించడంతో వారిని కూడా తమతో కలవమని అడుగుతుండడంతో వారు కూడా ఈ విషయమై స్పందించారు.
“నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం” అంటూ ఎస్వీ రంగారావు గారి మనవళ్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ గా మారింది.