రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లిపోయి… థియేటర్స్ కి మ్యూజికల్ కాన్సర్ట్స్ గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిపించేలా చేస్తోంది హీరో సూర్య, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘వారణం ఆయిరం’ సినిమా. తెలుగులో ఈ సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ పేరుతో రిలీజ్ అయ్యింది. 2008 నవంబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సూపర్ హిట్ అయ్యింది. హరీష్ జైరాజ్ ఇచ్చిన సాంగ్స్ ని ఇప్పటికీ వినే మ్యూజిక్ లవర్స్ ఉన్నారు అంటే సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఆల్బమ్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్, రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, అంతకన్నా అద్భుతమైన సాంగ్స్, సూర్య చూపించిన వేరియేషన్స్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ టేకింగ్ అన్నీ కలిసి సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా మార్చాయి. ఈ రేంజ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అవ్వలేదు. జులై 23న సూర్య పుట్టిన రోజున సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని రీరిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ అది వాయిదా పడి ఆగస్టు 4న రిలీజ్ అంటే ఈరోజున థియేటర్స్ లోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సూపర్బ్ ప్రీ బుకింగ్స్ రాబట్టిన ఈ సినిమా సాలిడ్ మార్నింగ్ షోని సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో అన్ని షోస్ ఫుల్ అయ్యాయి, యూత్ థియేటర్స్ కి వెళ్లి సూర్య సన్నాఫ్ కృష్ణన్ సాంగ్స్ ని పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామాకి సంబంధించిన విజువల్స్ ట్రెండ్ అవుతున్నాయి, ఇవి చూస్తే ఇది తమిళనాడా లేక హైదరాబాదేనా అనే అనుమానం రాకమానదు. ఒక తమిళ డబ్బింగ్ సినిమా రీరిలీజ్ కి ఈ రేంజ్ సెలబ్రేషన్స్ ని చూడడం ఇదే మొదటిసారి.