వంశీ, అనిల్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతున్న సినిమా ‘సుగ్రీవ’. మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్తపల్లి నగేశ్ దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి క్లాప్ ఇవ్వగా, నటుడు మహేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి మాట్లాడుతూ ”దర్శకుడు కొత్తపల్లి నగేష్ ఇదివరకే చాలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మా తొలి నిర్మాణంలో ‘సుగ్రీవ’ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. అందరూ మెచ్చే కథతో వస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని అన్నారు. దర్శకుడు కొత్తపల్లి నగేష్ మాట్లాడుతూ.. ”ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రంలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా ఇది మ్యూజికల్ చిత్రం అని చెప్పొచ్చు. ఈ నెల 21వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ గా కృష్ణప్రియ ఖరారు కాగా మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది” అని చెప్పారు. ఈ చిత్రానికి నందన్ రాజు బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.