Aayan: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ చిత్రంలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించారు. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ మీట్ అవర్ వైజాగ్ హీరో అంటూ ఒక ప్రత్యేకమైన ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో అయాన్ పాల్గొని మాట్లాడుతూ.. నా పేరు అయాన్. మాది వైజాగ్. అక్కయ్యపాలెంలో పెరిగాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి తెలుగు సినిమాలో హీరోగా నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇది నా తొలి చిత్రం. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్తో ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరూ సినిమా చేయలేదు. అలాంటి ప్రత్యేకమైన చిత్రానికి నేను హీరో అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్.. అని అన్నారు. అనంతరం అహల్యా బమ్రూ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ‘గౌరీ’ పాత్రను పోషిస్తున్నాను. మాది పుదుచ్చేరి . వైజాగ్ చూస్తుంటే నాకు పాండిచ్చేరి గుర్తొస్తుంది. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకున్నాను. ‘సింగ్ గీతం’లో నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయడం ప్రతి నటుడి కల. ఈ సినిమాతో నా ఆ కల నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
