సినీ ఇండస్ట్రీలో పని చేసే సమయాల గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. అందులో ప్రధానంగా దీపికా పదుకొణె.. ఎనిమిది గంటల పనివేళలు ఉండాలనే డిమాండ్తో ముందుకొచ్చింది. మిగతా రంగాల మాదిరిగా సినీ పరిశ్రమలో కూడా ఒక సమతుల్యమైన వర్క్ లైఫ్ ఉండాలని ఆమె కోరింది. అయితే ఈ డిమాండ్ చిన్న, మధ్య తరహా సినిమాలకు సరిగ్గా సరిపోవొచ్చు కానీ భారీ బడ్జెట్ సినిమాల్లో అనుసరించడం కష్టమని కొందరు భావిస్తున్నారు. దీపికా ఈ కారణంగానే ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి పెద్ద ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే
ఇటీవల ఈ అంశంపై యంగ్ హీరోయిన్ షాలిని పాండే స్పందించింది.. ఆమె మాట్లాడుతూ “నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ చదువుకునే రోజుల నుంచే ఆమెను ఫాలో అవుతుంటాను. ఆమె కెరీర్ జర్నీ చాలా ఇన్స్పైరింగ్. తనకు ఏది సరైనదో దాని గురించి తెగువగా మాట్లాడుతుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం గురించి ఆమె చెప్పిన విషయాలు చాలా మందికి ధైర్యం ఇచ్చాయి. ఆమె వల్లే ఇప్పుడు మేమంతా కూడా మన మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడగలుగుతున్నాం. ఆమె అడిగితే ఇవ్వాల్సిందే అనిపిస్తుంది. తాను కోరుకున్నది దక్కడం ఆమె హక్కే” అని పేర్కొంది. అలాగే మరో నటి కొంకణ సేన్ శర్మ కూడా దీపికా అభిప్రాయానికి మద్దతు పలికింది. “మేమూ మనుషులమే కదా! మేము డాక్టర్లు కాదు, రోజంతా ఆపరేషన్ చేయలేం. మాకూ విశ్రాంతి కావాలి, చిన్న బ్రేక్స్ అవసరం ఉంది” అని చెప్పింది. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.