Kakarla Krishna : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!

  • ప్రముఖ సీనియర్ నిర్మాత కాకర్ల కృష్ణ శనివారం కన్నుమూశారు
  • 'జగపతి' సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి తన స్వయంకృషితో నిర్మాతగా ఎదిగారు
  • 1974లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'ఇంటింటి కథ' చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు
Kakarla Krishna

Kakarla Krishna

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక సామాన్య ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించి, తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్‌లో సీనియర్ నిర్మాతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కాకర్ల కృష్ణ (09-05-2026) శనివారం నాడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

కాకర్ల కృష్ణ సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయన తొలినాళ్లలో ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ ప్రతిష్టాత్మక ‘జగపతి’ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు. అక్కడ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ తన సత్తా చాటారు. ఆ అనుభవంతో 1974లో కె. సత్యం దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ ప్రధాన తారాగణంగా రూపొందిన ‘ఇంటింటి కథ’ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. అనంతరం ‘ఏడంతస్తుల మేడ’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘రాగ దీపం’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన భాగస్వామిగా పనిచేశారు. కాకర్ల కృష్ణ నిర్మాతగా పరిచయమైన ‘ఇంటింటి కథ’ విడుదలై 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా 2023లో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ కృష్ణ ఎంతో చురుగ్గా ఉండేవారు. ఫిల్మ్‌నగర్ గృహ నిర్మాణ సంస్థలో, వి.బి. రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్రారంభమైన ‘ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానం’లో ఆయన కమిటీ సభ్యుడిగా ఉండి ఎనలేని సేవలందించారు.