తెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ను టాలీవుడ్ హీరోలు, మేకర్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే సంక్రాంతి సమరం మరింత రంజుగా మారబోతోంది. ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వెనక భారీగా మంటలు చెలరేగుతుండగా, ఒళ్లంతా నెత్తుటి మరకలతో, చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని రౌద్రంగా దూసుకొస్తున్న సాయి దుర్గా తేజ్ ఊరమాస్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2027న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కె. నిరంజన్ రెడ్డి సమర్పణలో ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్తోనే భారీ అంచనాలను పెంచేసింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహాకాళి’ కూడా సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు ఇప్పటికే పలు భారీ కాంబినేషన్లు పండగ రేసులో పోటీకి సిద్ధమయ్యాయి. వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ క్రేజీ మల్టీస్టారర్, మాస్ మహారాజా రవితేజ – శ్రీవిష్ణు ఎంటర్టైనర్, శర్వానంద్ – శ్రీనువైట్ల కాంబో చిత్రం, ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’, సాయి దుర్గా తేజ్ ‘SYG (సంబరాల ఏటిగట్టు)’. స్టార్ హీరోలు, డిఫరెంట్ జానర్ సినిమాలతో బాక్సాఫీస్ బరి కిక్కిరిసిపోవడంతో రాబోయే పండగ వినోదం ప్రేక్షకులకు అసలైన విందుగా మారనుంది.

