బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ బెగ్గర్’. వడ్ల జనార్థన్ దర్శకత్వంలో గురురాజ్, కార్తిక్ నిర్మిస్తోన్నఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్యప్రకాష్ క్లాప్ ఇవ్వగా, కార్తీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సత్యప్రకాశ్ మాట్లాడుతూ…’ ‘ఈ చిత్రంలో భద్ర అనే మెయిన్ విలన్ గా నటిస్తున్నాను. యువ నిర్మాతలు, యంగ్ టెక్నీషియన్స్ పని చేస్తోన్న ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. హీరో సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ…”దర్శకులు జనార్థన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ గోవా బ్యాక్ డ్రాప్ లో చాలా వరకు ఉంటుంది. వచ్చే నెలలో గోవా షెడ్యూల్ ప్లాన్ చేశాం. హృదయ కాలేయం చిత్రం నుంచి నన్ను ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. ఈ సినిమాను కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.
రైటర్ పోలూరి ఘటికాచలం మాట్లాడుతూ… ”ఈ కథ పైన దాదాపు ఏడాది కాలం వర్క్ చేశాం. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఇందులో హీరో పాత్ర, విలన్ పాత్ర రెండూ చాలా డిఫరెంట్ గా ఉంటాయి” అని చెప్పారు. దర్శకుడు వడ్ల జనార్థన్ మాట్లాడుతూ…” ‘మిస్టర్ బెగ్గర్’ అనే టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సరదాగా సాగే కుటుంబ కథా చిత్రానికి మంచి వినోదం పొందుపరిచాం. సంపూ గారి మేనరిజానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేశాం. బాంబే, చెన్నై, గోవాల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తిచేస్తాం” అని తెలిపారు.