‘ఆర్ఆర్ఆర్’… నిస్సందేహంగా ప్రస్తుతం దేశం మొత్తంలో సెట్స్ పై ఉన్న చిత్రాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్! దర్శకుడు రాజమౌళి… హీరోలు ఎన్టీఆర్, చరణ్. హాలీవుడ్ బ్యూటీతో పాటూ ఆలియా లాంటి టాప్ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్. అజయ్ దేవగణ్ లాంటి సీనియర్ స్టార్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగం! ఇంత వ్యవహారం ఉంది కాబట్టే జక్కన్న మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా, లాక్ డౌన్స్ అంతకంతకూ ఆలస్యం చేస్తున్నాయి. అయినా కూడా టీమ్ రాజమౌళి సైలెంట్ గా ఏం లేదు! తెర వెనుక వ్యాపార వ్యవహారాలు లాక్ డౌన్ వేళ కానిచ్చేస్తున్నారు. రికార్డు రేటుకి ‘ఆర్ఆర్ఆర్’ సాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి…
ఒకటి రెండు కాదు… ఏకంగా 325 కోట్లకు జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ‘ట్రిపుల్ ఆర్’ రైట్స్ స్వంతం చేసుకుంది.
దీని వల్ల తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ జీ5 స్వంతమైందని చెప్పుకోవచ్చు. టీవీ తెరపైన, ఓటీటీలోనూ కూడా రిలీజ్ తరువాత ‘ఆర్ఆర్ఆర్’ హక్కులన్నీ జీ5 సంస్థవే! అయితే, 325 కోట్లు కేవలం పోస్ట్ థియేట్రికల్ రైట్స్ కి మాత్రమే! అంటే, సినిమా థియేటర్లో విడుదలై వెనక్కి వెళ్లాక మాత్రమే ఈ హక్కులు వర్తిస్తాయన్నమాట! సాటిలైట్, డిజిటల్ కే 325 కోట్లు వసూలు చేసిన చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ పెద్దతెరపైకి వచ్చేందుకు పెద్ద బిజినెస్ చేస్తుందని ఘంటాపథంగా చెప్పవచ్చు! థియేటర్స్ లో ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ హిస్టారికల్ అమౌంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. చూద్దాం మరి, రాజమౌళి పాట్రియాటిక్ పిరియాడికల్ ఎప్పుడు బాక్సాపీస్ వద్దకొస్తుందో! ఎలాంటి కలెక్షన్ మైల్ స్టోన్స్ సెట్ చేస్తుందో! ‘బాహుబలి’ని మించిన దుమారమైతే పక్కా!